24 th May, 2010
హైదరాబాద్
ఏమిటీ ప్రపంచం?
ఎవరీ జనం?
ఎవరి కోసం ఈ అభివృద్ధి పధం?
మన బతుకులు బాగు చేసుకోవాడానికా? లేక మనకి మనమే గోతులు తీసుకోవాడానికా?
బతకడానికి అవసరమైన డబ్బు నేడు డాబు ను చూపే వస్తువైంది!
అక్రమంగా ఆర్జించేవాడు ధనికుడయ్యాడు ....
కానీ నిజమైన ధనవంతుడేవరు?
ధనం కూడబెట్టిన వాడా? లేక జనాన్ని ప్రేమించేవాడా?
పోయినప్పుడు నలుగుర్ని సంపాదించుకోలేని ధనం ఎందుకు?
నాడు నీటినదిగితే చల్లనిచ్చే సాంప్రదాయం వుండేది అని విన్నాను.కానీ నేడు సేద తీరడానికి నిలువెత్తు నీడ దొరకడమే ఖరీదైంది...
ప్రజలు బతకడానికి ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకో బడ్డదే ప్రభుత్వం..కానీ ప్రభుత్వమే గాడి తప్పితే ప్రజలు బతికేదేట్లు ...?
నీటి ఖరీదు పెరిగింది..నిప్పు ఖరీదు పెరిగింది..తిండి ఖరీదు పెరిగింది..పంచ భూతాలు కూడా ధనవంతులకు దాసోహమనే స్థితి కి వచేసింది! నీటికి ఖరీదు కట్టే వారి ఉవాచ -"జనాల ఆర్జన పెరిగింది..కాబట్టి వీటి ఖరీదు పెరిగింది.."
వీరు ఊహించే జనాలు ఎవ్వరు? ధనం తప్ప జనం గురించి ఎరగని ధనికులా ? వీరు ఎంతమంది? వంద కోట్లు జనాభా లో ఇసక రేణువంత మరి మిగితా వారు ఎవ్వరు ...ఏ ..
చేనేత చీరలకు సరైన ధరలు పలకక అవే చీరలతో ప్రాణాలు తీసుకుంటున్న చేనేత కార్మికులు వీరికి గుర్తులేరా?
రేయింబవళ్ళు వ్యవసాయం చేసినా గుప్పెడు మెతుకులకు నోచుకోని రైతు కూలీలు వీరికి కనపడరా ?
సింగరేణి గనులలో బొగ్గును తీస్తూ బుగ్గి పాలవుతున్న ప్రజలు వీళ్ళకి పట్టరా?
లేక పట్టాలు చేత బట్టుకుని పొట్ట గడవని నిరుద్యోగులు వీరికి తట్టరా? మరి ఎవ్వరని ఉద్ధరించడానికి ఈ అభివృద్ధి పధం ? ఎవరు చేస్తారు వీరి బతుకులకు న్యాయం?
ఎవరు చేస్తారు వీరి బతుకులకు న్యాయం / ఎవరు వేస్తారు వీరి బతుకులకు బంగారు పధం ?
ఏ వీరు మనుషులు కాదా ? వీళ్ళకి బతికే హక్కు లేదా ?
పల్లకీ అందరూ ఎక్కుతారు.. కానీ మోసేవాడు లేకపోతే ఎలా కదులుతారు?
మరి ఎవరు చేయాలి వీరికి న్యాయం? ఎవరు?...........
ఎవరు తెస్తారు ఏ ఇసక రేణువులలో చైతన్యం? మనమే తేవాలి..!
మన ప్రశ్నకు మనమే బదులివ్వాలి ! మనం చెసిన నష్టాన్ని మనమే భర్తీ చేయాలి !
మన అగ్న్యానానికి మనమే జ్ఞ్యానం కావాలి...నిద్రపోతున్న మనలో మానవత్వాన్ని మనమే నిద్రలేపాలి...
మనలోని ఈర్ష్యాద్వేషాలన్ని మనమే కాంక్రీట్ సమాధుల్లో సమాధి చేయాలి..
దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్ అనే నానుడికి మనమే నిర్వచనం కావాలి...
నలుగురినీ ప్రేమించాలి..నలుగురికీ ప్రేమపంచాలి ...
సాటి మనిషిని కరుణ తో కాక కక్షలతో, కత్తులతో పలకరించే రాక్షసత్వం ఈ రావణ కాష్టం లో రగిలి బూడిదవ్వాలి...
అభివృద్ధి పేరుతో భూమి తల్లికి జరిగే తీవ్రమైన అన్యాయం పై మనమే ధ్వజం ఎత్తాలి..
అందరికీ సహాయం..అందరం సమానం అనే కొత్త మాట కు మనమే శ్రీకారం చుట్టాలి...కన్నీరు మున్నీరు గా విలపిస్తున్న ప్రకృతి బిడ్డలకు మనమే పరిహారము చూపాలి...ప్రేమ పంచాలి...
రాబోయే తరాన్ని మనమే సాదరంగా అందమైన ప్రపంచంలోకి ఆహ్వానించాలి ...వసంత ఋతువును ఎముకలు కోరికే చలితో, స్వైన్ ఫ్లూ జ్వరాలతో కాక,కోకిల స్వరాల తో ఆహ్వానించాలి..
ఎండా కాలాన్ని, మండించే ఎండలతో కాక పసందైన మామిడిపండ్ల రుచులతో స్వాగతం పలకాలి..
మళ్లీ మన సిమెంటు స్మశానాలలో కాక...ప్రకృతి ఒడిలో హాయిగా వీరిని కూర్చోబెట్టాలి..అక్షరాభ్యాసం చేసి..ప్రకృతి నీడలో సేద తీరుస్తూ పెద్దబాలశిక్షలు చదివించాలి .. ప్రేమను ఆప్యాయతల్ని ఉగ్గు పాలతో పట్టి తాగించి, కక్షలూ,ద్వేషాలూ లేని ఒక నూతన నవ సమాజ నిర్మాణం జరగాలి..
ఇది జరగాలంటే మనం మారాలి.. మార్పుని మనతో ఆహ్వానించాలి...
-సమాప్తం-
జై హింద్